కర్మయోగము(3 వ అధ్యాయం)

కర్మయోగము(3 వ అధ్యాయం)

అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్దం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని అడిగాడు.

అప్పుడు కృష్ణుడు "
ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానయోగంగానూ,యోగులకు కర్మయోగంగానూ చెప్పాను.కర్మలు(పనులు) చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు. ఇంద్రియనిగ్రహం కలిగి,ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు.

యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధహేతువులు. బ్రహ్మదేవుడు యజ్ఞాలవలన ప్రజలు వృద్ది పొందుతారని ఉపదేశించాడు.

యజ్ఞాల ప్రాముఖ్యత
యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు.యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాలనుండి విముక్తులవుతారు.కర్మల వలన యజ్ఞాలు,యజ్ఞం వలన వర్షం,వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకలభూతాలు పుడుతున్నాయి.

పరమాత్మ వలన వేదాలు,వాటి వలన కర్మలు సంభవించాయి.ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి,ఆచరించని వారు పాపులు.

ఆత్మజ్ఞానికి చేయవలసిన కర్మలు లేవు. అతడు సర్వస్వతంత్రుడు ఐన కారణంగా కర్మలు చేయడంవలన అతనికి లాభం కానీ,చేయకపోవడంవలన అతనికి నష్టం కాని ఉండవు. నీవు కూడా నిష్కామంగా కర్మలు చేయి. జనకుడు మొదలగువారు కూడా నిష్కామకర్మలు చేసారు.

ఉత్తముల కర్మలను,ప్రమాణాలను లోకులు ప్రమాణంగా తీసుకొని ప్రవర్తిస్తారు.

నాకు కూడా మూడు లోకాలలోనూ ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం,లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను. ఓ అర్జునా అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్ట్లే ,జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి. జ్ఞాని పనిచేసేవారి బుధ్ధి చలింపచేయకుండా తను పని చేస్తూ వారి చేత కూడా పని చేయించాలి.అన్ని కర్మలూ ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తనే చేస్తున్నానని తలుస్తాడు.కాని జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకారరహితంగా ఉంటాడు. అలా ఆసక్తి కలిగినవారి మార్గాన్ని జ్ఞానులు ఆటంకపరచరాదు.

అన్ని కర్మలనూ నాకే సమర్పించి,కోరికలనూ,అహంకారాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి వివేకవంతుడవై యుద్దం చేయి.పైవిధంగా చేసినవారు సమస్తకర్మ దోషాల నుండి విముక్తులవుతారు. మిగిలినవారు భ్రష్ఠులు.

మహాజ్ఞాని కూడా ప్రకృతిపరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది?

రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు. అందువలన మరణించినా ఫర్వాలేదు.

కామం యొక్క ప్రభావం
అప్పుడు అర్జునుడు ఇష్టంలేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు. కృష్ణుని సమాధానం రజోగుణం నుండి పుట్టే కామక్రోధాలే దీనికి కారణం. పొగ చే అగ్ని,మాయచే పిండము కప్పబడినట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామం మనస్సును ఆవరించి,వివేకాన్ని హరించి మనుషులను భ్రమింపచేస్తోంది. కాబట్టి ఇంద్రియనిగ్రహంతో కామాన్ని విడువు.

శరీరం కంటే ఇంద్రియాలు,వాటి కన్నా మనసు,మనసు కన్నా బుధ్ధి ,బుధ్ధి కన్నా ఆతమ గొప్పది. ఆత్మ వీటన్నిటికన్నా పైన ఉంటుంది. కాబట్టి బుధ్ధితో మనసుని తద్వారా కామాన్ని జయించు.