జ్ఞానయోగము (4 వ అధ్యాయం)

జ్ఞానయోగము (4 వ అధ్యాయం)

ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు. కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది. అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము. నివు చెప్పినది ఎలా సాధ్యము?"అన్నాడు.

కృష్ణుడు "నీకు,నాకు ఎన్నో జన్మలు గడిచాయి.అవన్నీ నాకు తెలుసు. నీకు తెలియదు నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకునేనే జన్మిస్తుంటాను.

ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు ప్రతియుగంలోను నేను అవతరిస్తాను.

ఈ విధంగా తెలుసుకొన్నవాడు,రాగ,ద్వేష,క్రోధ,భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు.

నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను. మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.కర్మఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు. గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను. నేను ఆకర్తను,అవ్యయుడను.నిష్కాముదనై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు. ఇలా చేసేవారిని కూడా అంటవు. జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తారు. ఏ కర్మలు చేయాలో,ఏవి చేయకూడదో చెప్తాను విను. కర్మ,అకర్మ,వికర్మ అని మూడు రకాలు. కర్మగతి గాఢమైనది కర్మలలో ఆకర్మలను,ఆకర్మలలో కర్మలను చూసేవాడు,ఫలాపేక్షరహితుడు,కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్దం చేసేవాడు బుద్ధిమంతుడు. కోరికలేనివాడు,జయాపజయాల పట్ల సమబుద్దిగలవాడు,సందేహరహితుడు,ఈర్ష్యారహితుడు బంధాలలో చిక్కుకోడు.

ఈశ్వరప్రీతిగా మాత్రమె కర్మలు చేయువాడికి ప్రారబ్దము కూడా నశిస్తుంది కాని బాధించవు. ఇవ్వబడునది,ఇచ్చేవాడు,ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్ని కూడా బ్రహ్మమే.

కొందరు ఆత్మను ఆత్మ యందె,ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహమనే అగ్నిలో,మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో ,మరికొందరు వాయుగమనాన్ని నిరోదించి అపానంలో ప్రాణాన్ని ,ప్రాణంలో అపానాన్ని,ఇంకొందరు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు.

ద్రవ్యరూప యజ్ఞాన్ని,వ్రతరూప తపోయజ్ఞాన్ని,ప్రాణాయామ పరమైన యోగయజ్ఞాన్ని,వేదాభ్యాస స్వాధ్యాయ యజ్ఞాన్ని ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి.ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు.యజ్ఞశేషం అమృతంలాంటిది.యజ్ఞం చేయనివాడికి ఇహపరాలు రెండూ ఉండవు.

ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి.అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే. తత్వవేత్తలను వినయముతో సేవించి,ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

ఆ జ్ఞానాన్ని తెలుసుకొంటే నా వలెనే సమస్తాన్ని నీయందే చూడగలవు.మోహానికి గురికావు. ఎంతపాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు. కర్రలను అగ్ని వలె,కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది.జ్ఞానమును మించినది లేదు.కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకొంటున్నాడు. శ్రద్దజ్ఞానాలు లేనివారు,సందేహాలు కల్గినవాడు,నమ్మకం లేని వాడు చెడిపోతారు. ఇహపరాలు రెండింటికీ దూరమవుతారు. పరమార్థ జ్ఞానంతో కర్మలను,బ్రహ్మజ్ఞానంతో సందేహనివృత్తిని చేసుకోన్నవాడిని కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానం చే సందేహాలను నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించులే.